కేంద్ర కేబినెట్ కీలక సమావేశం ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంగణంలో జరగనుంది. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు నిన్న మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి.
NCP అధినేత శరద్పవార్ను కాదని అజిత్ పవార్తో కలిసి వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్కు కేంద్ర కేబినెట్లో చోటు దక్కవచ్చని తెలుస్తోంది. NCPని చీల్చి తన వర్గం MLAలతో కలిసి షిండే సర్కార్కు మద్ధతు ప్రకటించారు అజిత్ పవార్. దీంతో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావ్ అట్రాం, సునీల్ వాల్సడే, అదితి ఠాక్రే, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, అనిల్ పాటిల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో NCPకి ప్రస్తుతం 53 మంది సభ్యులున్నారు. దాదాపు 30 మంది అజిత్ పవార్కు మద్దతు తెలుపుతున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫఢ్నవీస్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారని సమాచారం. మిత్రపక్షాలకు ఈసారి విస్తరణలో తగిన అవకాశం కల్పిస్తారని BJP వర్గాలు చెబుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను కూడా మార్చనున్నారు. BJP తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని తొలగించి.. కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగిస్తారు. కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్ నుంచి తొలగిస్తారని తెలుస్తోంది.
హనుమకొండలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని నిన్న పలు గ్రామాల కార్యకర్తలు కలిశారు. మీరే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగాలని పలువురు ఆయన దగ్గర కంటతడి పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన బండి సంజయ్.. ‘మోదీ సభకు అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో తెలియదు. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్. మోదీ సభను విజయవంతం చేయాల’ని కార్యకర్తలకు సూచించారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com