50 ఓవర్ల ఫార్మాట్కు వీడ్కోలు చెప్పేలోపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్ గెలిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఈ స్టార్లిద్దరూ మరో రెండేళ్లపాటు కెరీర్ కొనసాగించగలరా అన్నదే ప్రశ్న. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు రోహిత్-కోహ్లీ ఎంపికయ్యారు. ఏ ఫార్మాట్లోనూ కెప్టెన్గా లేకుండా చాన్నాళ్ల తర్వాత రోహిత్ భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కోహ్లీ కూడా సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో కనిపించబోతున్నాడు. వాళ్లిద్దరినీ చూడడం అభిమానులకు ఆనందమే. కానీ 2027 వన్డే ప్రపంచకప్లోగా జరిగే వన్డేలు చాలా తక్కువ. అప్పటి వరకు రోహిత్, కోహ్లీ ఫిట్నెస్ కాపాడుకుంటూ.. ఫామ్ నిరూపించుకుంటూ.. కుర్రాళ్ల నుంచి పోటీని తట్టుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది.
ఇక వన్డేల్లో కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి గిల్కు బాధ్యతలు అప్పగించారు. వన్డేల్లో రోహిత్ ఫామ్ బాగానే ఉంది. అలాంటప్పుడు రోహిత్ను తప్పించాల్సిన అవసరం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను పెట్టలేమని, రోహిత్కు చెప్పే నిర్ణయం తీసుకున్నామని అగార్కర్ చెప్పినా.. రోహిత్ విషయంలో అన్యాయం జరిగిందని , తనంతట తాను తప్పుకొనే వరకు కెప్టెన్గా కొనసాగించాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు.
56 వన్డేల్లో రోహిత్ శర్మ భారత్కు సారథ్యం వహించాడు. అందులో 42 మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు రెండుసార్లు ఆసియాకప్ (2018, 2023)ను అందించాడు. 2023 ప్రపంచకప్లో భారత్ను ఫైనల్ చేర్చాడు.