APలో మొంథా తుఫాన్ ప్రభావంపై తన కార్యాలయ అధికారుల ద్వారా క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్ల నుంచి పేషీ అధికారులు క్షేత్రస్థాయి సమాచారం తీసుకున్నారు. అర్థరాత్రి తుపాను తీరం దాటిన క్రమంలో తీవ్రమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో కలిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు.
పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ తీగలు పడటం, అదే విధంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
తుఫాన్ బలహీనపడ్డా భారీ వర్షాలు ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని ఈ రోజు కూడా అక్కడే ఉంచి ఆహార, వసతి కల్పించాలని స్పష్టం చేశారు. గాలులు తీవ్రంగా ఉండటం, కుండపోతగా వర్షం ఉన్నందున ప్రజలను ఇప్పటికిప్పుడు ఇళ్లకు పంపించడం శ్రేయస్కరం కాదన్నారు. ప్రజలకు పరిస్థితిని వివరించాలని సూచించారు.
ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, నెల్లూరు జిల్లాలో పెన్నా నది, ఈ జిల్లాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్న క్రమంలో ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. వర్షాలు తగ్గు ముఖం పట్టిన తరవాత పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టిపెట్టాలనీ, తాగు నీరు సరఫరా చేయాలని సూచించారు.