లక్నోలో లెక్క సరి చేయాల్సిందే.. కానీ రోహిత్ సేనకు అదే ప్రాబ్లమ్

0
వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా ఐదు విజయాలతో సెమీస్‌కు చేరువైన భారత్.. మరో విజయంపై కన్నేసింది. మధ్యాహ్నం లక్నో వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఇంగ్లాండ్‌ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌పై మాత్రమే విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌, శ్రీలంక లాంటి చిన్న జట్ల చేతుల్లోనూ ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లాండ్‌ జట్టు దాదాపుగా సెమీస్‌కు దూరమైనట్లే కనిపిస్తోంది. అయితే మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, టాప్-4కు చేరాలని బట్లర్‌ సేన ప్లాన్.
సొంత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో జోరు మీదున్న భారత్.. సెమీస్‌ బెర్తుపై గురి పెట్టింది. అయితే 2019 వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించిన ఇంగ్లాండ్‌.. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లోనూ దెబ్బకొట్టింది. వరల్డ్ కప్‌లో చరిత్రలో ఇరు జట్లు 8 సార్లు తలపడ్డాయి. భారత్ 4- 3తో పైచేయిలో ఉంది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇక భారత్‌కు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో పెద్ద సమస్యలేమీ లేవు. రోహిత్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌ నిలకడగా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, కుల్‌దీప్‌, జడేజా సత్తా చాటుతున్నారు. గత మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న షమీ కూడా అదరగొట్టాడు. వీళ్లంతా ఇదే జోరును కొనసాగిస్తే ఇంగ్లాండ్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.
అయితే హార్దిక్‌ గాయంతో ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. గత మ్యాచ్‌లో శార్దూల్‌ను కూడా తప్పించి సూర్యకుమార్‌, షమీలను తుది జట్టులోకి తీసుకున్నారు. షమీ అయిదు వికెట్లతో అదరగొట్టగా.. సూర్య విఫలమయ్యాడు. లక్నో పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో మూడో స్పిన్నర్‌గా అశ్విన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, సూర్యకుమార్‌, జడేజా, కుల్‌దీప్‌, అశ్విన్‌/సిరాజ్‌, బుమ్రా, షమీ.
ఇంగ్లాండ్‌: మలన్‌, బెయిర్‌స్టో, రూట్‌, స్టోక్స్‌, బట్లర్‌ (కెప్టెన్‌), లివింగ్‌స్టన్‌, బ్రూక్‌, రషీద్‌, విల్లీ, వోక్స్‌, అట్కిన్సన్‌.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleఈటల మాట నెగ్గింది.. మరి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చేనా..?
Next articleGold Rates: బంగారం ధర పెరగడానికి కారణాలేంటి..?