కరోనా వైరస్ వ్యాప్తిపై మరో సంచలన విషయం బయటపెట్టిన శాస్త్రవేత్తలు

23
కరోనా మహమ్మారి వ్యాప్తిపై శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న మురుగునీటిలో.. నిన్న సాధారణ జలాల్లో కరోనా వైరస్‌ను గుర్తించగా.. తాజాగా దుమ్ము కణాల్లోనూ దీన్ని కనుగొన్నారు ఇటలీ శాస్త్రవేత్తలు. రెండు ప్రాంతాల్లో వాయు కాలుష్య నమూనాలను సేకరించి పరీక్షించామని, ఈ నమూనాల్లో కరోనా జన్యువును గుర్తించామని బొలాన్యా యూనివర్సిటీ ప్రొఫెసర్ లియోనార్డో సెట్టి తెలిపారు.
అయితే ఇది ఎంతటి పరిమాణంలో.. ఎంత దూరం ప్రయాణించి.. మనుషులకు ఎంతటి తీవ్రతను కలిగిస్తుందనే దానిపై లోతైన అధ్యయనం అవసరమని సెట్టి చెప్పారు. వాయు కాలుష్య కణాలు అధికస్థాయిలో ఉండే కొద్దీ ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
సాధారణంగా కరోనా బాధితుడు తుమ్మినప్పుడు గానీ, దగ్గినప్పుడు గానీ ఈ తుంపర్ల ద్వారా వైరస్ బయటికొస్తుంది. ఈ తుంపర్లు సదరు బాధితుడి నుంచి ఒకటి, రెండు మీటర్ల దూరం మాత్రమే పడతాయి. అయితే ఐదు మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన తుంపర్లు గాలిలో ఆయా ఉష్ణోగ్రతలను బట్టి నిమిషాల నుంచి గంటల వరకు గాలిలోనే ప్రయాణిస్తుంటాయని సెట్టి వివరించారు. అయితే ఇంత తక్కువ పరిమాణంలోని తుంపర్లలో ఉన్న వైరస్‌ల ద్వారా వ్యాధి వ్యాపిస్తుందని నిర్ధారణకు రావడం లేదన్నారు.
కరోనా మరణాలు ఎక్కువ సంభవించడానికి వాయు కాలుష్యం ఓ కారణం కావొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. కరోనా సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతుంటాడని, అదే సమయంలో అతడు కలుషితమైన వాయువును పీల్చడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ప్రాణాలు కోల్పోతున్నాడని తెలిపారు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీలలో 80శాతం మరణాలు కాలుష్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే సంభవించినట్లు స్పష్టం చేశారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleకిమ్ పిల్లలు పగ్గాలు చేపట్టే ఛాన్సుందా.. దక్షిణ కొరియా ఏమంటోంది?
Next articleటీఆర్ఎస్ ప్రస్థానంపై హరీష్ రావు రాసిన సువర్ణాక్షరాలు

23 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here