MLAల కొనుగోలు కేసులో CBI విచారణకు న్యాయపరంగా లైన్ క్లియర్ అయింది. గత అక్టోబరులో కేసు నమోదైంది. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ డిసెంబరులో CBI విచారణకు ఆదేశించింది. ఈ మేరకు CBI హైదరాబాద్ అధికారులు.. కేసు వివరాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి లేఖ రాశారు. కానీ సిట్ (SIT) అధికారులకు ఆ సమాచారం అందలేదు. ఫలితంగా సిట్ నుంచి ఎలాంటి సమాచారం సీబీఐ అధికారులకు చేరలేదు.
తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో CBI అధికారులు మరోసారి ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. ఆ వివరాలు అందాక, సీబీఐ వాటిని పరిశీలించి.. కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్తో పాటు ఫిర్యాదుదారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసి, విచారించి వారి స్టేట్మెంట్ను రికార్డు చేస్తారు. మరోవైపు ED… త్వరలోనే మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారించనుంది.
తెలంగాణ హైకోర్టు తీర్పుపై సిట్ (SIT) సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు CBI అధికారులు వెయిట్ చేస్తారా లేక హైకోర్టు ఆదేశాల మేరకు విచారణను మొదలుపెడితే తెలంగాణ సర్కార్ వ్యూహం ఎలా ఉంటుందనేది కీలకంగా మారనుంది.