కాసేపట్లో వరంగల్‌‌కు మోదీ.. ప్రధాని హోదాలో తొలిసారి వచ్చింది మాత్రం..

0
కాసేపట్లో ప్రధాని మోదీ వరంగల్‌ చేరుకుంటారు. తొలిసారి వరంగల్‌ వస్తున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికేందుకు BJP శ్రేణులు సిద్ధమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో మోదీతో పాటు రాష్ట్ర BJP అగ్రనాయకుల హోర్డింగులు ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలతో వరంగల్‌ సిటీ కాషాయమయంగా మారింది. వరంగల్‌కు 1994లో ప్రధాని హోదాలో పీవీ వచ్చారు. మళ్లీ ఉమ్మడి వరంగల్‌కు ప్రధానులెవరూ రాలేదు. 29 ఏళ్ల తర్వాత ఇప్పుడు మోదీ రానున్నారు.
ప్రధాని మోదీ హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని.. అనంతరం బహిరంగసభలో ప్రసంగించనున్నారు. కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌లో దిగుతారు. ముందు భద్రకాళి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక దగ్గరికి చేరుకుంటారు. కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్‌ ఫ్యాక్టరీ, పీవోహెచ్‌లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ.6,109 కోట్ల అభివృద్ధి పనులకు సభా వేదిక నుంచే ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
హనుమకొండ సభకు విజయసంకల్ప సభగా నామకరణం చేశారు. సభా వేదికపై ప్రధాని సహా మొత్తం ఎనిమిది మంది మాత్రమే కూర్చుంటారు. కిషన్‌రెడ్డి, నితిన్‌ గడ్కరీల తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఉంటుందని షెడ్యూలులో ఉంది. కానీ సీఎం సహా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులెవరూ ప్రధాని పర్యటనకు హాజరు కావడం లేదని, ప్రధాని పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రోటోకాల్‌ ప్రకారం.. వేదికపై ప్రధానితో పాటు ఇద్దరు కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కరీంనగర్‌, వరంగల్‌ ఎంపీలు బండి సంజయ్‌, దయాకర్‌, రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాత్రమే కూర్చునేలా ఏర్పాటు చేయనున్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleBJP అధిష్టానం మరో కీలక నిర్ణయం.. తెలంగాణకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌‌గా..
Next articleమోదీ “ఎన్నికల కేబినెట్‌”పై కసరత్తు పూర్తి.. తెలంగాణ, ఏపీ నుంచి..