కాలినడకన ప్రతి చెట్టు పరిశీలించిన పవన్ కల్యాణ్

తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించారు.
ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలు తెలుసుకున్నారు.
అలాగే తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గోడౌన్‌ను పవన్ కల్యాణ్ పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎ, బి, సీ, నాన్ గ్రేడ్‌ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్‌లో రికార్డులు పరిశీలించారు.
ప్రతి ఎర్రచందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
Previous articleSSMB29: మరో అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి..
Next articleBIHAR: రెండో విడతలోనూ రికార్డు బ్రేక్ అవుతుందా..?