ఇచ్చిన హామీని నెరవేర్చిన పవన్ కల్యాణ్

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిలబెట్టుకున్నారు. సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా పవన్ కల్యాణ్ చొరవ తీసుకొని ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించారు. దీంతో కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 1,551 మంది రైతులకు మేలు జరగనుంది.
కాకినాడ సెజ్ రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి పవన్ ప్రత్యేకంగా తీసుకువెళ్లారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కాకినాడ సెజ్ రైతులకు ఊరట కలిగించింది కూటమి ప్రభుత్వం. కాకినాడ సెజ్‌కు భూములు ఇచ్చిన భూముల్లో 2,180 ఎకరాలను తిరిగి రైతులకు ఇచ్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. కాకినాడ సెజ్ పరిధిలో రైతులకు వెనక్కి ఇచ్చిన భూమి, తిరిగి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కాక సతమతం అవుతున్న విషయంపై దృష్టి సారించిన పవన్ కల్యాణ్ గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిచేస్తూ రైతులకు న్యాయం చేశారు. గత ప్రభుత్వంలో కాకినాడ సెజ్ భూములపై జీవో నెం.12 విడుదల అయినా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు మేలు జరగలేదు. వారి పేరున రిజిస్ట్రేషన్లు జరగలేదు. దీంతో పిల్లలకు పెళ్లిళ్లు, చదువుల నిమిత్తం భూములు ఉపయోగపడటం లేదని రైతులు పవన్ కల్యాణ్‌కు గతంలో చెప్పారు. దీనిపై పూర్తి వివరాలు పరిశీలించి, రైతులకు మేలు జరిగేలా చూస్తానని పవన్ కల్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు.
ఈ సమస్యను ఇటీవల శాసన మండలి సమావేశాల్లో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రైతులు పడుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించారు. భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ కాకపోవడంతో రైతు భరోసా వంటి పథకాల లబ్ధి అందడం లేదని, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికీ వీలు లేకుండా పోయిందని సభ ముందుంచారు. దీంతో ఈ సమస్య మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం.. కాకినాడ సెజ్ రైతులకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతుల భూములు రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేసేలా ఆదేశాలు జారీ చేసింది.
Previous articleGoogleతో AP సర్కార్ కీలక ఒప్పందం.. AI సిటీగా వైజాగ్
Next articleఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కంటెంట్‌పై మెటా ప్రకటన