వన్డే వరల్డ్ కప్లో పాకిస్థాన్ మళ్లీ ఓడిపోయింది. భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్థాన్ మళ్లీ గెలుపు రుచే చూడలేకపోయింది. గత మ్యాచ్లో అఫ్గానిస్థాన్ చేతిలో కంగుతిన్న పాక్.. దక్షిణాఫ్రికాపై గొప్పగా పోరాడినా చివరికి ఓటమి వైపే నిలిచింది. దీంతో బాబర్ సేన నాకౌట్ దారులు దాదాపు మూసుకుపోయాయి. ప్రపంచకప్ చరిత్రలోనే పాకిస్థాన్ తొలిసారి వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది. 1999 తర్వాత ప్రపంచకప్లో పాక్పై దక్షిణాఫ్రికాకు ఇదే తొలి విజయం.
ఆరు మ్యాచ్లు ఆడిన పాకిస్థాన్ జట్టు రెండింటిలోనే విజయం సాధించింది. ఆ జట్టు ఖాతాలో కేవలం నాలుగు పాయింట్లే ఉన్నాయి. తదుపరి మూడు మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్తో పాక్ తలపడాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొలి మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, భారత్, న్యూజిలాండ్ సెమీస్ దిశగా ముందంజలో ఉన్నాయి. ఆస్ట్రేలియా 6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
చివరి మూడు మ్యాచ్ల్లో గెలిచినా పాకిస్థాన్కు 10 పాయింట్లే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో.. తదుపరి నాలుగు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా కనీసం రెండింటిలో ఓడాల్సి ఉంటుంది. అది జరిగితే కంగారూలు కూడా 10 పాయింట్లతో ఉంటారు. అప్పుడు పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల అదృష్టం నెట్ రన్రేట్పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చివరి నాలుగు మ్యాచ్ల్లో మూడింటిలో ఓటమి పాలైతే.. అప్పుడు పాకిస్థాన్ నాలుగో స్థానంలో నిలుస్తుంది. కానీ అది సాధ్యమయ్యే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు.