10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడబోతోంది టీమ్ఇండియా. అప్పుడు జట్టులో ఉన్న దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్.. ఇప్పుడు రిటైరైపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ముగ్గురూ లేకుండా సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఆడబోతోంది. వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ ఇవాళ అహ్మదాబాద్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇంగ్లాండ్లో కెప్టెన్గా సత్తా చాటుకున్న శుభ్మన్ గిల్కు సొంతగడ్డపై ఇదే తొలి సిరీస్.
కోహ్లి, రోహిత్ లేకపోయినా ఇంగ్లాండ్తో సిరీస్లో పెద్దగా లోటు కనిపించలేదు. ఆల్రౌండ్షోతో సిరీస్ను సమం చేసింది శుభ్మన్ సేన. అయితే స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఆడుతూ అశ్విన్ లేని లోటును భర్తీ చేయడం అంత తేలిక కాదు. ఇప్పటిదాకా టెస్టుల్లో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్.. అశ్విన్ స్థానంలో తుది జట్టులోకి రానున్నాడు.