❇️ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసిన హైడ్రా కమిషనర్
❇️ హైడ్రా లాంటి వ్యవస్థ అన్ని రాష్ట్రాలకూ అవసరమంటూ పవన్ కితాబు
❇️ ఓ వివాహ వేడుకకు విజయవాడ వెళ్లిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకూ అవసరమని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అన్నారు. పాలకుల ముందు చూపు.. నిబద్ధత గల అధికారుల పని తీరు ఏ వ్యవస్థకైనా మంచి పేరు తీసుకువస్తాయన్నారు. దేశంలోనే మొట్టమొదటిగా హైడ్రా రూపంలో సరికొత్త వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.
కొత్త వ్యవస్థను తీసుకురావడమే కాకుండా.. సరైన అధికారిని నియమించడం.. అధికారాలు కట్టపెట్టడం.. పూర్తి స్వేచ్ఛతో పని చేసే అవకాశం కల్పించడం జరిగితే ఫలితాలు బాగుంటాయన్నారు. ఎంతో నిబద్ధతతో పని చేస్తున్న ఏవీ రంగనాథ్ను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభినందించారు.