తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరగనుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిచి జోష్లో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మరో రెండు ఉప ఎన్నికలకు రెడీ అవుతోంది.
BRS నుంచి గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే విచారణ చేపట్టారు. అయితే ఇదే విషయంలో వివరణ కోరుతూ.. MLAలు కడియం శ్రీహరి, దానం నాగేందర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు ఇచ్చారు.
10 మంది MLAలకు స్పీకర్ గతంలోనే నోటీసులు జారీ చేశారు. సమాధానం ఇచ్చిన 8 మంది అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం మరింత గడువు కావాలని స్పీకర్ను కోరారు.
ఇవాళ్టితో 8 మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తి అవుతుంది. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ మరోసారి నోటీసులిచ్చారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని ఇద్దరికీ సూచించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నాయి. స్పీకర్ అనర్హత వేటు వేయకముందే.. MLA పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
విచారణ పూర్తయిన ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయసలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత స్పీకర్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాలుగు వారాల్లోగా ఈ కేసులో నిర్ణయం ప్రకటించాల్సి ఉన్నందున స్పీకర్ విచారణను స్పీడప్ చేశారు. మిగతా 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా.. దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా చేస్తే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం.