మెదక్ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్పల్లిలో నిన్న సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడు సాయివర్ధన్ కథ విషాదాంతమైంది. 17 అడుగుల లోతు నుంచి ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని NDRF బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు ఆక్సిజన్ పైపులోనికి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమీ ఫలించలేదు. 150 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో సాయివర్థన్ 25 అడుగుల లోతున ఉండొచ్చని భావించి.. బావికి సమాంతరంగా పొక్లెయిన్లతో మరో గొయ్యి తవ్వి దాదాపు 8.30 గంటల పాటు సహాయక బృందాలు శ్రమించినా ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com